అల్లు అర్జున్ పేరు, ఫొటోల వాడకంపై ఢిల్లీ హైకోర్టు నిషేధం

  • అల్లు అర్జున్ పేరు, వాయిస్, ఫొటోల ముందస్తు అనుమతి లేని వాడకంపై నిషేధం
  • ఏఐ టూల్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీల ద్వారా సృష్టించిన కంటెంట్‌ను అడ్డుకున్న ఢిల్లీ హైకోర్టు
  • వ్యాపార అవసరాల కోసం ఐకాన్ స్టార్ గుర్తింపును వాడుకోవడంపై మధ్యంతర ఉత్తర్వులు
  • అభ్యంతరకరమైన వెబ్‌సైట్లు, లింకులను 72 గంటల్లో తొలగించాలని ఆదేశం
  • ఇటీవలి కాలంలో పర్సనాలిటీ రైట్స్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్న పలువురు ప్రముఖులు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన పేరు, ఫొటో, వాయిస్‌తో పాటు ఇతర వ్యక్తిగత గుర్తింపులను ముందస్తు అనుమతి లేకుండా వ్యాపార అవసరాలకు వాడుకోవడంపై న్యాయస్థానం మధ్యంతర నిషేధం విధించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్ టెక్నాలజీల ద్వారా అల్లు అర్జున్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న పలు సంస్థలు, వెబ్‌సైట్లపై కఠిన ఆంక్షలు జారీ చేసింది.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, కొన్ని వెబ్‌సైట్లు అక్రమంగా తన ఫొటోలతో కూడిన వస్తువులను విక్రయిస్తున్నాయని, ఏఐ టూల్స్ ద్వారా తన వాయిస్‌ను క్లోన్ చేసి ఫేక్ కాల్స్ సృష్టిస్తున్నారని తెలుపుతూ అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్న అసభ్యకరమైన కంటెంట్‌ను కూడా ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ తుషార్ రావు గెడెలతో కూడిన సింగిల్ జడ్జి ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. "విజేత" సినిమాలో బాలనటుడిగా మొదలైన ఆయన ప్రయాణం "పుష్ప" సిరీస్‌తో జాతీయ స్థాయికి చేరిందని, ఆయనో కమర్షియల్ సక్సెస్ సాధించిన గౌరవప్రదమైన నటుడని న్యాయమూర్తి ప్రశంసించారు. అల్లు అర్జున్ పేరు, ఆహార్యం, వాయిస్, డైలాగ్ డెలివరీ, సిగ్నేచర్ వంటివి ఆయనకు మాత్రమే ప్రత్యేకమైనవని స్పష్టం చేశారు. వీటిని అనుమతి లేకుండా వాడితే ఆయనకు తీరని నష్టం వాటిల్లుతుందని కోర్టు అభిప్రాయపడింది.

అల్లు అర్జున్ గుర్తింపును ఉపయోగించి ఏఐ జనరేటెడ్ డీప్‌ఫేక్స్, ఫేస్ మార్ఫింగ్ వంటివి సృష్టించకూడదని, ఆయన ఫొటోలతో దుస్తులు, పోస్టర్లు అమ్మకూడదని కోర్టు స్పష్టం చేసింది. అభ్యంతరకరంగా ఉన్న లింకులు, వెబ్‌సైట్లను 72 గంటల్లోగా తొలగించాలని సంబంధిత సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను జులై 14, సెప్టెంబర్ 24వ తేదీలకు వాయిదా వేసింది. కాగా, ఇటీవలి కాలంలో తమ పర్సనాలిటీ రైట్స్‌ను కాపాడుకునేందుకు గౌతమ్ గంభీర్, నాగార్జున, కాజోల్, ఐశ్వర్య రాయ్, సునీల్ గవాస్కర్ తదితర ప్రముఖులు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి రక్షణ పొందారు.

Allu Arjun
Delhi HC
Personality Rights Case

More Telugu News